భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దు.. ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ వార్నింగ్
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:50 PM
భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ హెచ్చరించారు. ఎలాంటి పర్యావసానాలనైనా లెక్క చేయకుండా భారత్ భారీ దాడులు చేయగలదని తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ సహనాన్ని బలహీనతగా భావించొద్దని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్పై డిస్కవరీలో త్వరలో ప్రసారం కానున్న డాక్యుమెంటరీ సిరీస్లో భాగంగా ఎన్ఎస్ఏ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్పై ఎన్ఎస్ఏ ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే తొలిసారి. పహాల్గాం దాడి తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సమయంలో పరిస్థితులపై అజిత్ డోభాల్ ఈ డాక్యూసిరీస్లో పలు కీలక వివరాలను వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలు ఏమిటో ముందస్తుగానే నిర్ణయించుకున్నామని అజిత్ డోభాల్ తెలిపారు. పహల్గాం దాడి వెనకున్న ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలపై భారత్ దీటుగా స్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సిందూర్తో పంపామని చెప్పారు.
‘ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాము. భారత దేశ సహనాన్ని బలహీనతగా భావించి పొరపాటు చేయొద్దు. భారత్ ఎంతటి రిస్క్నైనా తీసుకోగలదు. పర్యావసానాలను లెక్క చేయకుండా దాడులు చేయగలదు’ అని ఆయన అన్నారు. డోభాల్తో పాటు ఈ ఆపరేషన్ వెనకున్న పలువురు అధికారులు తమ అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు.
శనివారం రాత్రి 9 గంటలకు డిస్కవరీలో, డిస్కవరీ+ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దాడులకు ప్రతీకారంగా భారత్ గతేడాది మే7న ఆపరేషన్ సిందూర్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలు ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆ తరువాత 88 గంటల పాటు ఇరు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. మే 10న పాక్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.
ఈ వార్తలనూ చదవండి:
కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ జాబ్స్.. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
వామ్మో దెయ్యం.. భయంతో హాస్టల్ వదిలి వెళ్లిన 608 మంది విద్యార్థులు